టీ - కాంగ్రెస్‌లో తెరమీదకు మరో సంచలన అంశం!

by Disha Web Desk 4 |
టీ - కాంగ్రెస్‌లో తెరమీదకు మరో సంచలన అంశం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఫలితాలతో జోష్ మీదున్న టీకాంగ్రెస్‌లో కొత్త చర్చ మొదలైంది. పార్టీలో టికెట్ల విషయంలో హాట్ హాట్ చర్చ జరుగుతున్న వేళ యూత్ కాంగ్రెస్ నేతలకు టికెట్ల వ్యవహారం తెరమీదకు వచ్చింది. ఈ అంశంపై తాజాగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూత్ కాంగ్రెస్ నేతలకు టికెట్ల విషయంపై పార్టీలో చర్చిస్తామని చెప్పారు. హైదరాబాద్ వేదికగా బుధవారం నుంచి ఐవైసీ నేషనల్ ఎగ్జిక్యూటీవ్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.

శివసేన రెడ్డి అధ్యక్షతన నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శివసేన రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారం దిశగా నడిపించేందుకు యూత్ కాంగ్రెస్ భారీ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ఎగ్జిక్యూటీవ్ సమావేశాల్లో తీసుకోబోయే యూత్ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్ర చేపట్టబోతున్నామన్నారు. సీఎం నియోజకవర్గం గజ్వేల్ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తామని చెప్పారు.

అధికారంలోకి వస్తే యూత్ కమిషన్ ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిచంబోతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశాలకు జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బి.వి. శ్రీనివాస్, ఉత్తమ్, వంశీచందర్ రెడ్డి, మహేష్ కుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఇటీవల జరిగిన ఒడిశా రైలు ప్రమాద మృతులకు నివాళి అర్పించారు.

Next Story

Most Viewed